హైదరాబాద్ ను క్రైం ఫ్రీ సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో పోలీసుల సమన్వయంతో నగరంలో క్రైం రేటు భారీగా తగ్గిందని హైదరాబాద్ పోలీసు కమిషనర్, డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ప్రజల సహకారం ప్రశంసనీయమని తెలిపారు. ప్రభుత్వం సీవీ ఆనంద్ ను హోం శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేయడంతో, ఆయన ఆదివారం క్రైం రిపోర్టింగ్ మీటింగ్ నిర్వహించి, 2023 ఆగస్టు నుండి 2025 సెప్టెంబరు వరకు నగరంలో క్రైం రేటు వివరాలను విడుదల చేశారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయడం వల్ల నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణాన్ని అందించగలిగామని, దీనికి సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా అందరూ కలిసి పనిచేసి హైదరాబాద్ ప్రతిష్ఠను, సిటీ పోలీసింగ్ కీర్తిని చాటాలని కోరారు.