రిచర్డ్ రిషి నటించిన ‘ద్రౌపది 2’ చిత్రీకరణ పూర్తి

జి.ఎం. ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి నేతాజీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ మీద చోళ చక్రవర్తి నిర్మిస్తున్న ‘ద్రౌపది 2’ సినిమా షూటింగ్ పూర్తయింది. తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు మోహన్.జి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేటి (సెప్టెంబర్ 23)తో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత సినిమా విశేషాలను పంచుకున్నారు.
దర్శకుడు మోహన్.జి మాట్లాడుతూ..“నిర్మాత చోళ చక్రవర్తి ఇచ్చిన పూర్తి మద్దతు వల్లే అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తి చేయగలిగాం. ఆయనకు ఇది మొదటి సినిమా అయినా, సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్, విజన్ అద్భుతమైనవి. ఆయన ఇచ్చిన సృజనాత్మక స్వేచ్ఛతో ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించగలిగాను” అని అన్నారు.నిర్మాత చోళ చక్రవర్తి మాట్లాడుతూ.. “దర్శకుడు మోహన్.జి గారితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఆయన పనితీరు నన్ను బాగా ఆకట్టుకుంది. షూటింగ్ అనుకున్న సమయం కంటే ముందే పూర్తయింది. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన మోహన్ గారికి నా ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం భవిష్యత్తులో మరిన్ని సినిమాలు నిర్మించాలనే నా సంకల్పాన్ని మరింత బలోపేతం చేసింది” అని అన్నారు. ‘ద్రౌపది 2’ ఒక చారిత్రక యాక్షన్ డ్రామా. ఇందులో రిచర్డ్ రిషి ముఖ్య పాత్ర పోషిస్తుండగా, రక్షణ ఇందుసుదన్ కథానాయికగా నటించారు. నట్టి నటరాజ్, వై.జి. మహేంద్రన్, నాడోడిగల్ బరణి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ చిత్రానికి పద్మ చంద్రశేఖర్, మోహన్.జి మాటలు రాశారు. గిబ్రాన్ వైబోధ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ ఫిలిప్ ఆర్. సుందర్, ఎడిటింగ్ దేవరాజ్ నిర్వహించారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్లు సన్నాహాలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్