మంగళవారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ మహేష్ బి. గీతే, పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులపై సమీక్షించి, ప్రజలకు మరింత చేరువయ్యేలా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం అందించాలని, గ్రామాల్లో పోలీస్ అధికారులు తరచుగా పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపర్చుకోవాలని ఆదేశించారు. పెట్రోలింగ్ సమయంలో రౌడీ షీటర్లను తనిఖీ చేయాలని, ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని సూచించారు. సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.