యూనిటీ ఫౌండేషన్ నిన్న హైదరాబాద్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో మహిళల సాధికారత కోసం ‘భారత్ పాఠశాల’ ఆన్లైన్ విద్యా వేదికను మే 11, 2025న మదర్స్ డే సందర్భంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఎన్నో భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ వేదిక రెండేళ్లలో 1,00,000 మంది మహిళలకు డిజిటల్ నైపుణ్యాలు, వ్యవస్థాపకత, ఆర్థిక నిర్వహణ కోర్సులను ఉచితంగా అందించనుంది. గ్రామీణ, పట్టణ మహిళలకు స్వావలంబన మార్గాన్ని సుగమం చేయడమే లక్ష్యమని సహ వ్యవస్థాపకుడు వంశీ అందుకూరి వివరించారు.
అదేవిధంగా, ‘యూనిటీ డ్రైవ్ 2025’ గురించి మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి వ్యాలీ వరకు 4,000 కిలోమీటర్ల ఈ యాత్ర మే 15, 2025న ప్రారంభం కావాల్సి ఉండగా, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడినట్లు సంస్థ తెలిపింది. ప్రభుత్వ సలహాల ఆధారంగా సురక్షిత సమయంలో కొత్త తేదీలను ప్రకటిస్తామని వ్యవస్థాపకులు వెల్లడించారు. ఈ యాత్ర మహిళల సాధికారత, రోడ్ సేఫ్టీ, సైబర్ అవగాహన సందేశాలను ప్రజలకు చేర్చనుంది.