మోసం.. సెలవుపై వచ్చిప్పుడల్లా ఓ పెళ్లి!

44890చూసినవారు
మోసం.. సెలవుపై వచ్చిప్పుడల్లా ఓ పెళ్లి!
అతడు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. సెలవులపై ఇండియాకు వస్తూ ఉంటాడు. కానీ వెళ్లే ముందు మాత్రం కొత్త పెళ్లి కొడుకులా తిరుగు ప్రయాణం అవుతాడు. వచ్చిన ప్రతి సారి ఒకరిని పెళ్లాడతాడు. ఇలా అనేక మంది యువతులను మోసం చేసిన వ్యక్తి బండారాన్ని బయటపెట్టిందో యువతి. అసలేం జరిగింది..

తనను వివాహమాడి మోసగించాడంటూ గుంటూరు జిల్లా క్రోసూరు మండలానికి చెందిన ఒక యువకుడిపై గుంటూరు పోలీసులకు ఓ యువతి సోమవారం ఫిర్యాదు చేసింది. గుంటూరుకు చెందిన ఎంబీఏ చదివిన యువతిని 2019లో సదరు వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. రూ. 25 లక్షల కట్నంతో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. నెల రోజుల పాటు ఇక్కడే ఆమెతో కాపురం చేశాడు. తాను మళ్లీ వచ్చి తీసుకెళ్తానని చెప్పి అమెరికా వెళ్లాడు. కొన్నాళ్ల తర్వాత ఫోన్ చేసినా రెస్పాండ్ రాలేదు. అతడి తల్లిదండ్రులను ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానం ఇచ్చారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. లోతుగా విచారిస్తే అతనిపై ఇదే తరహా వివాహాలు చేసుకుని మోసం చేసినట్లు కేసులున్నాయని తెలిసింది.

అమెరికాలో గ్రీన్ కార్డు కలిగిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. 13 ఏళ్ల క్రితం విశాఖకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుని ఆమెను విడిచిపెట్టాడు. ఆపై ఆమె బంధురాలినే పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత నరసరావుపేటకు చెందిన మరొక యువతిని వివాహమాడాడు. ఇలా చివరకు గుంటూరు యువతిని పెళ్లిచేసుకుని అమెరికా వెళ్లిపోయాడు. కాగా 2020లో విజయవాడకు చెందిన మరో యువతితో నిశ్చితార్థ చేసుకున్నట్లు గుర్తించారు.