తెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా అనకాపల్లి పట్టణంలోని ఉమారామలింగేశ్వరాలయం, పైడిపాల కూడలిలోని వామలింగేశ్వర స్వామి ఆలయాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శారదానది ఉప్పొంగి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. పైడిపాలలో వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారి ఆలయాలతో పాటు గర్భగుడిలోని శివలింగం కూడా నీట మునిగిపోయాయి.