అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో గురువారం రాత్రి హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. చలిని తట్టుకోవడానికి మంచం కింద కుంపటి పెట్టుకుని నిద్రించిన వృద్ధురాలు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. గ్రామానికి చెందిన వంకల మాణిక్యం (74) పూరింట్లో ఒంటరిగా నివసిస్తోంది. నిద్రలో ఉండగా దుప్పటి కుంపటికి తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో పూరిల్లు కాలిపోగా, ఆమె బయటపడలేక అక్కడికక్కడే మృతి చెందింది. అరుపులు విని వచ్చిన పొరుగువారు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని గుర్తించారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.