కామవరపుకోట మండలం తడికలపూడి సమీపంలో శనివారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో పెదవేగి మండలం వేగవరం గ్రామానికి చెందిన పామర్తి మల్లికార్జున (35) అనే దివ్యాంగుడు సజీవదహనం అయ్యారు. కొబ్బరికాయల అమ్మకాల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న అతను 18 మంది కూలీలతో కలిసి తూత లక్ష్మణరావు తోటలో కొబ్బరి కోతకు వెళ్లారు. కాయలు కోస్తుండగా, కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు లారీకి తగలడంతో మంటలు వ్యాపించాయి. లారీపై కూర్చున్న మల్లికార్జునకు మంటలు అంటుకుని దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధమైంది.