ఒడిశాలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విశాఖపట్నంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. బుధవారం మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్నా, సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఉక్కపోతతో బాధపడుతున్న ప్రజలకు ఇది ఉపశమనం కలిగించింది. రానున్న 24 గంటల్లో మరికొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.