వేలేరుపాడు సంతబజారులో సంభవించిన అగ్నిప్రమాదంలో అక్కాచెల్లెళ్లు సజీవ దహనమైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. సూర్యాపేట జిల్లాకు చెందిన శిగా పూలమ్మ(65), వేలేరుపాడుకు చెందిన తన చెల్లి వలగాని సావిత్రి(60)ని చూసేందుకు కొన్ని రోజుల కిందట ఇక్కడికి వచ్చారు. వీరి మృతిపై కుటుంబ సభ్యుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సావిత్రి ఉంటున్న ఇల్లు రేకులతో, చుట్టూ గోడలకు బదులు వెదురు తడికలు కట్టారు. అయితే చుట్టూ ఉన్న వెదురు తడికలకు మంటలు అంత తీవ్ర స్థాయిలో అంటుకోవడం, మంటలు చెలరేగే సమయంలో వీరు ప్రతిఘటించే ప్రయత్నం చేయకపోవడం, వేర్వేరు మంచాలపై నిద్రిస్తున్న వీరు కదలకుండా అలాగే ఉండిపోయి మృతి చెందడంపై పలు సందేహాలు వస్తున్నాయి.