కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రపంచానికి, ముఖ్యంగా భారత ఐటీ పరిశ్రమకు పెను ప్రమాదమని ఆర్థిక సర్వే వ్యాఖ్యానించింది. ఏఐ ప్రభావం ఉద్యోగాలపై నేరుగా ఉంటుందని, 2008 ఆర్థిక సంక్షోభం కంటే భయంకర విపత్తుకు దారితీయవచ్చని సర్వే అభిప్రాయపడింది. దేశీయ ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై ఏఐ ప్రభావం ముందుగానే పడవచ్చని, ఉన్న ఉద్యోగాలను తొలగించడమేగాక, కొత్త ఉద్యోగావకాశాలను దూరం చేయగలదని పేర్కొంది. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 'ఎకనామిక్ సర్వే 2025-26'లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.