ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో భక్తుల భద్రత దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేదార్నాథ్ వైపు వెళ్లే యాత్రికులను శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో నిలిపివేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి మార్గం సురక్షితమని నిర్ధారణ అయిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. భక్తులు వదంతులను నమ్మకుండా అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని సూచించారు.