యోగసింధూర్ విజయోత్సవం: అమరవీరుల కుటుంబాలకు అండగా 'ఆరోగ్య భారత్ ఉద్యమం'

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లక్ష మందికి పైగా ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమైన "యోగసింధూర్ – ఆరోగ్య భారత్ ఉద్యమం" విజయోత్సవ సభ జూలై 6న నగరంలోని టి-హబ్ వేదికగా ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులు మురళి నాయక్ మరియు బి. సంతోష్ కుమార్ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1,00,000 చొప్పున,మొత్తం రూ. 2 లక్షల చెక్కులను అందజేశారు. కార్యక్రమం ద్వారా మిగిలిన రూ. 1,30,070ను నేషనల్ డిఫెన్స్ అకాడమీకి విరాళంగా అందజేశారు.

ఈ ఉద్యమంలో 250 మంది వాలంటీర్లు, లక్ష మందికి పైగా పాల్గొన్న భాగస్వాములు దేశవ్యాప్తంగా యోగాపై చైతన్యాన్ని రగిలించారని నిర్వాహకులు తెలిపారు. ఈ కృషిని గుర్తించిన వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, డా. యోగ నారాయణకి మరియు యోగసింధూర్ కమిటీ అధ్యక్షులు కె. శివ దుర్గాప్రసాద్ కి వరల్డ్ రికార్డు సర్టిఫికేట్లను ప్రదానం చేసింది. ఈ రికార్డులను పూజ్యులు కే. శివ నారాయణ దంపతుల చేతుల మీదుగా అందజేయడం విశేషం.

ముఖ్య అతిథిగా విచ్చేసిన నిఖిల్ గుండా (AI గురు, డిజిటల్ కనెక్ట్స్) యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. సదాశివ యోగాన్ని స్వామి వివేకానందుని దృక్కోణంలో వివరిస్తూ సమాజ ఆరోగ్యంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమం సందర్భంగా ఉద్యమంలో పాల్గొన్న వాలంటీర్లకు, భాగస్వాములకు గౌరవ సర్టిఫికేట్లు అందజేయబడ్డాయి.
డా. యోగ నారాయణ నాయకత్వంలో సక్సెస్ లైఫ్ ఫౌండేషన్ మరియు యోగసింధూర్ ఆర్గనైజింగ్ కమిటీ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాయి. "మన ఆరోగ్యం – మన దేశ బలం!" అనే నినాదంతో సాగిన ఈ కార్యక్రమం "జై హింద్! జై భారత్! వందే మాతరం!" అనే నినాదంతో ముగిసింది.

సంబంధిత పోస్ట్