భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో బ్రహ్మోత్సవాల సమయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల 30 గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆలయ ప్రాంగణంలో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, సత్తుపల్లి మండలాలలోని కిష్టారం గ్రామానికి నీటి సరఫరా చేసే మిషన్ భగీరథ పైపులైన్ డ్యామేజ్ అవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగ సమయంలో నీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.