అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ యాప్ విధానాన్ని నిజామాబాద్ జిల్లాలో అందుబాటులోకి తెచ్చామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఈ నూతన విధానం అమలుపై సమీక్షించారు. మ్యానువల్ విధానానికి స్వస్తి పలికి, పూర్తిగా ఆన్లైన్లోనే ఇసుక బుకింగ్ చేసుకునేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో ప్రయోగత్మకంగా ప్రవేశపెట్టిన ఈ విధానం విజయవంతం కావడానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, రవాణా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.