యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు:
కంది మండలంలోని చెర్యాలలో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమ లే అవుట్లను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణాలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు చేయడమే కాకుండా జీప్లస్-1 నిర్మాణాలు చేపట్టారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారికి అధికారులు మూడు దఫాలుగా నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టొద్దని నోటీసులిచ్చినా స్పందన లేకపోవడంతోనే అధికారులు స్థానిక అధికారులను కాకుండా ఇతర ప్రాంత అధికారులతో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, కమిటీతో శనివారం కూల్చివేతలు చేపట్టారు. కందిలో మూడు నిర్మాణాలు, కవలంపేటలో ఒక నిర్మాణం, చెర్యాలలో 4 నిర్మాణాలను అధికారులు కూల్చి వేశారు. ఈ సందర్భంగా కంది ఎంపీడీవో విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. అక్రమంగా లేవుట్లను ఏర్పాటు చేసి నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు రియల్టర్లు అక్రమంగా లే అవుట్లను ఏర్పాటు చేసి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. అందులో బడి, గుడి, ఆటస్థలం కూడా ఉండదు. అందులో చిన్నారులు రోడ్లపైకి వచ్చి ఆటలాడుకుంటారు. దీంతో ప్రమాదాల బారిన పడిన సంఘటనలు ఉన్నాయి. వెంచర్లో నిబంధనల ప్రకారం తప్పనిసరిగా 30 ఫీట్ల రోడ్లు ఉండాలి. కానీ 10 ఫీట్ల రోడ్డు మాత్రమే వదిలి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రజలు అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లలో ప్లాట్లు కొని ఇబ్బందుల పాటు కావొద్దని ఎంపీడీవో సూచించారు.