కర్నూలు మండలం గార్గేయపురం డంప్యార్డులో కొనసాగుతున్న బయోమైనింగ్ పనులు పూర్తయిన వెంటనే సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. ఆదివారం డంప్యార్డు వద్ద పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, బయోమైనింగ్ ప్రక్రియను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని సూచించారు. నగరంలో ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ కోసం చేపట్టాల్సిన ప్రాజెక్టులను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని, పెరుగుతున్న చెత్త సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సమగ్ర ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు.