పథకం ప్రకారమే దాడులు : మంత్రి నక్కా ఆనందబాబు

రాజకీయాల్లోకి పదవీ వ్యామోహంతో వచ్చే పార్టీలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని టిడిపి జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆనందబాబు మాట్లాడారు. అసాంఘిక శక్తులు ఒక పథకం ప్రకారమే గుంటూరులోని ఎన్టీఆర్ విగ్రహాలను కాల్చి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాయని, పార్టీలకు అతీతంగా ప్రతీఒక్కరూ ఈ ఘటనను ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పినట్లు పేర్కొన్నారు. కేసీఆర్, మోడీతో జగన్ కలిసి చేస్తున్న కుట్రను తిప్పి కొట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేసిన వారు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో దాసరి రాజా మాస్టారు, మన్నవ మోహనకృష్ణ, చిట్టిబాబు,లాల్ వజీర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్