జగనన్న తోడు పధకం..కొందరికి మోధం, మరికొందరికి ఖేధం!

11391చూసినవారు
జగనన్న తోడు పధకం..కొందరికి మోధం, మరికొందరికి ఖేధం!
జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం ద్వారా తూర్పుగోదావ‌రి జిల్లాలో 33వేల 450మందికి రెండోవిడ‌త‌లో 33కోట్ల 45లక్షల రూపాయిల మేర ల‌బ్ధి చేకూరింది. ఒక్కో ల‌బ్ధిదారుని ఖాతాలో 10 వేలు చొప్పున వ‌డ్డీలేని రుణాల‌ను ఖాతాల్లో జమ చేసారు. జిల్లా అధికార్ల గణాంకాల ప్రకారం, గ్రామీణ‌ప్రాంతాల్లో డి.ఆర్.డి.ఏ. ఆధ్వర్యంలో స్త్రీనిధి ద్వారా 23వేల 241 మందికి, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆద్వర్యంలో డీసీసీబీ ద్వారా 10వేల 204 మంది ల‌బ్ధిదారులు లబ్దిపొందారు.

సామాజిక కేటగిరిల వారీగా తీసుకుంటే, ఎస్‌.సీ. కేట‌గిరీలో 7 వేల 375 మంది, ఎస్‌టీ కేట‌గిరీలో 1వేల388 మంది, బీ.సీ. కేటగిరీలో 14వేల 44 మంది, ఓ.సీ. కేట‌గిరీలో 9వేల 978 మంది, మైనారిటీ కేట‌గిరీలో 660 మంది లబ్దిపొందారు. జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం నిజంగా చిరువ్యాపారులకు వరం అనిచెప్పవచ్చు. స్థిర ఆస్తి, నిలకడ అయిన ఆదాయం లేని వీరికి బ్యాంక్ లు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ, ప్రభుత్వం వీరందరి కి పూచీకత్తు ఉండి, బ్యాంక్ ల ద్వారా 10 వేల రుణం ఇప్పించింది. దీంతో సాంప్రదాయ వృత్తి సేవలు అందించేవారికి, చిరు వ్యాపారాలు, తోపుడు బండ్లు, గంపలతో తిరిగి వీధి వ్యాపారాలు చేసేవారికి పెద్ద ఎత్తున ప్రయోజనం లభించింది.

జగనన్నతోడు పధకంలో లబ్దదార్ల ఎంపికలో ఇంకా పారదర్శకత లోపించింది. సైకిల్లు, మోపెడ్ ల పై, రహదారుల వెంబడి పండ్లు, కూరగాయలు, కొబ్బరి బొండాలు, మొక్కజొన్న విక్రయించే వారికి ఈ పధకం లో లబ్ది చేకూరలేదు. ఇటువంటి వారు జిల్లాలో ఇంకా 5వేలకు మించే ఉంటారని ఎన్.జి.ఓ ల లెక్కలు బట్టి తెలుస్తోంది. వాస్తవానికి స్థిరమైన అడ్రస్ లేని తోపుడు బండి, గంపలతో వీధి వీధి తిరిగే వారికి, ఫుట్ పాత్ వ్యాపారం చేసే వారిని గుర్తించి ఈ పధకం వర్తింప చేయాల్సి ఉండగా ఈ దిశగా కసరత్తు చేయలేదు. దీంతో ఇంకా పేద వర్తకులు ఆర్దిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

జగనన్నతోడు పధకం లో అర్హుల గుర్తింపు లోపభూయిష్టంగా జరిగింది. ఇళ్లల్లో దుఖాణాలు నిర్వహిస్తున్న బట్టల వ్యాపారులకు, కిరాణా వ్యాపారులకు, ఇత్తడి, స్టీలు సామాన్లు అమ్ముకునేవారికి, ఫ్యాన్సీ దుఖాణాలకు, బ్యాంగిల్‌ షాపులకు వారికి. కుట్టుమిషన్‌ తో హాబీగా బట్టలు కుట్టే గృహిణిలకు వర్తింపచేశారు. ఈ వ్యాపారులకు ఒక డోర్ నెంబర్ తో స్థిరమైన అడ్రస్ ఉంటుంది. వీరికి ఇప్పటికే పలు మార్లు బ్యాంక్ లు లోన్ ఇచ్చాయి. వివిదరూపాల్లో ఆర్దిక సాయం అందింది. ఇటువంటి వారిని ఫిల్టర్ చేయకుండా మళ్లీ వీళ్లనే ఎంపిక చేసి నగదు సాయం చేశారు. ఈ విధంగా 40శాతం అనర్హులకు పధకం వర్తించింది. ప్రభుత్వం విశాల దృక్పదంతో ముందుకు వచ్చినా బ్యాంక్ లు మాత్రం రీపేమెంట్ సామర్ధ్యం ఉన్నవారినే ఎంపిక చేసి రుణాలు ఇచ్చారు.