అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలో పోలీసుల వైఫల్యం కనిపిస్తుంది. పుల్లంపేట మండలం పాపక్క గారి పల్లెలో వైసీపీ నేతలు టీడీపీ, జనసేన ఏజెంట్ల కారును ధ్వంసం చేసి కిడ్నాప్ చేసిన ఘటన మరువక ముందే దలవాయిపల్లి పోలింగ్ స్టేషన్లో జనసేన రాజారెడ్డి కిడ్నాప్ కలకలం రేపింది. ఏజెంట్ కిడ్నాప్తో దలవాయిపల్లి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ నిలిచిపోయింది. కేతరాజు పల్లి పోలింగ్ కేంద్రంలో కూడా జనసేన ఏజెంట్లను కిడ్నాప్ చేస్తారని ఏజెంట్లు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయకపోతే వైసీపీ నేతలు రిగ్గింగ్ చేసే అవకాశం మెండుగా ఉందని ఆరోపిస్తున్నారు.