ఎలిమినేటర్‌లో బెంగళూరుపై కోల్‌కతా విజయం

9006చూసినవారు
ఎలిమినేటర్‌లో బెంగళూరుపై కోల్‌కతా విజయం
ఐపీఎల్ 14వ సీజన్ లో భాగంగా సోమవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్ లో బెంగళూరుపై కోల్‌కతా జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్‌ ట్రోఫీ గెలవాలనుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు మరోసారి నిరాశే మిగిలింది. టైటిల్‌ కోసం 14 ఏళ్లుగా కొనసాగుతున్న నిరీక్షణ ఇంకో ఏడాదికి వాయిదా పడింది. విరాట్‌ కోహ్లికి కెప్టెన్‌గా ఇదే చివరి సీజన్‌ కావడంతో కోహ్లి అభిమానులు బెంగళూరు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నరైన్‌ (4/21) అద్భుత బౌలింగ్‌ కారణంగా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 138 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో కోహ్లి (39) టాప్‌ స్కోరర్‌. 139 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ శుభ్‌మన్‌ గిల్‌ (29), వెంకటేశ్‌ అయ్యర్‌ (26), సునీల్‌ నరైన్‌ (26) రాణించడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగా 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సిరాజ్‌ (2/19), హర్షల్‌ పటేల్‌ (2/19), చాహల్‌ (2/16) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసినా తమ జట్టును గెలిపించుకోలేకపోయారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన కోల్‌కతా సెకండ్ ఎలిమినేటర్ లో ఢిల్లీని ఢీకొట్టబోతోంది. ఆ మ్యాచ్ లో గెలిచిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.