కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడుయూరప్ప 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో హోంమంత్రి జీ పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే పోక్సో కేసులో యెడుయూరప్పను అరెస్ట్ చేస్తామని, దీనిపై రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. మరోవైపు అరెస్టు భయంతో, యెడుయూరప్ప కర్ణాటక హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది.