మూడోసారి ఫైనల్‌కు చేరిన కోల్‌కతా

15038చూసినవారు
మూడోసారి ఫైనల్‌కు చేరిన కోల్‌కతా
ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచులో కోల్‌కతా టీం అద్భుతం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ విధించిన 136 పరుగుల టార్గెట్‌ను 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించి, ఐపీఎల్ 2021లో ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటికే ఫైనల్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌తో అక్టోబర్ 15 శుక్రవారం నాడు దుబాయ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం తలపడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఏదశలోనూ కోలుకోకుండా చేసింది. తక్కువ స్కోర్‌ను దాదాపు ఓపెనర్లే పూర్తి చేస్తారా అనేలా బ్యాటింగ్ చేసి విజయానికి 96 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. వెంకటేష్ అయ్యర్ కేవలం 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 55 పరుగులు చేశాడు. విజయానికి మరో 39 పరుగులు కావాల్సిన సమయంలో రబాడా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. కానీ, అప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలోంచి మ్యాచ్ జారిపోయింది. అనంతరం శుభ్మన్ గిల్ (46 పరుగులు, 46 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) రాణించడంతో కోల్‌కతా విజయం చాలా తేలికగా మారింది. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ ఔటయ్యాడు. అయితే వీరిద్దరు ఔటయ్యాక పరిస్థితి మొత్తం మారిపోయింది. చివరి బంతి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించేందుకు రెడీ అయింది. వరుసగా వికెట్లు తీస్తూ విజయానికి చాలా చేరువయ్యారు. కానీ, త్రిపాఠి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన తరుణంలో మరో బంతి మిగిలుండగానే సిక్స్ కొట్టి కోల్‌కతా విజయాన్ని ఖరారు చేశాడు. ఈ మధ్యలో నితీష్ రానా 13 పరుగులు చేసి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరువాత దినేష్ కార్తిక్ 0, మోర్గాన్ 0, షకిబుల్ హసన్ 0, సునీల్ నరైన్ 0 పరుగులకు పెవిలియన్ చేరారు. ఢిల్లీ బౌలర్లలో రబాడా, నార్త్ట్, అశ్విన్ తలో 2 వికెట్లు, అవేష్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.

అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ టీం టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 135 పరగులు చేసింది. దీంతో కోల్‌కతా టీం ముందు 136 పరుగుల స్కోర్‌ను ఉంచింది. అయితే ఈ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం బౌలర్లు ఎంతో పొదుపుగా బౌలింగ్ చేసి ఢిల్లీని చాలా తక్కువ పరుగులకు కట్టడి చేశారు. పృథ్వీ షా(18) పరుగులతో మంచి ఊపులో ఉన్నప్పుడు చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోతూ, పరుగులు సాధించడంలో వెనుకపడ్డారు. ధావన్ (36) ఒక్కడే అత్యధిక పరుగులు చేసిన వాడిగా నిలిచాడు. స్టోయినిస్ 18, రిషబ్ పంత్ 6, హెట్ మెయిర్ 17 తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. శ్రేయాస్ అయ్యర్ 24, అక్షర్ పటేల్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, శివం మావి, ఫెర్గూసన్ చెరో వికెట్ పడగొట్టారు.