విష్ణువు రెండో అవ‌తారం ఆ ఆల‌యం.. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క ఆలయం

16184చూసినవారు
విష్ణువు రెండో అవ‌తారం ఆ ఆల‌యం.. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క ఆలయం
విష్ణువు దశావతార రూపుడన్న విషయం మనకు తెలిసిందే. ప్రతి రూపానికి సంబంధించి భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేవాలయాలు వందల సంఖ్యలో ఉన్నాయి. అయితే ఒకే ఒక రూపానికి సంబంధించి ప్రపంచంలో ఒకే దేవాలయం ఉంది. అదే కూర్మావతారానికి సంబంధించిన దేవాలయం. మేరు పర్వతంతో సముద్రాన్ని చిలికే సందర్భంలో ఆ పర్వతం సముద్రంలో మునగకుండా కాపాడటానికి విష్ణువు కూర్మం రూపం దరించాడని చెబుతారు. ఆ కూర్మం రూపానికి ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ కాకుళం జిల్లాలో శ్రీకూర్మం అనే గ్రామంలో ఉంది. ఇందుకు కారణం ఈ కథనంలో తెలుస్తుంది. అదే విధంగా ఈ దేవాలయంలోని పుష్కరిణిలో శ్రీకృష్ణుడు స్నానం చేశాడని ఆ పుష్కరిణిలో మనం కూడా స్నానం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్మకం.

శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో కూర్మావతారం రెండోది. మిగిలిన అన్ని అవతారాలకు సంబంధించిన ఆలయాలు ప్రపంచం అంతటా ఉన్నాయి. అయితే కూర్మావతారానికి సంబంధించి ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క ఆలయం ఉంది. అది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మం అనే గ్రామంలో ఉంది. శ్రీ కూర్మం ఉన్న ప్రాంతంలోనే శ్వేతపురమనే పట్టణం ఉంది. దానిని రాజధానిగా చేసుకుని శ్వేతచక్రవర్తి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్యపేరు విష్ణప్రియ. విష్ణుభక్తురాలైన ఆమె ఏకాదశి వ్రత దీక్షలో ఉంటుంది. ఆమె భర్త కామమోహితుడై విష్ణుప్రియ దగ్గరకు వస్తాడు. అప్పుడు విష్ణుప్రియ భర్తను ఒక చోట కుర్చోబెట్టి పూజా మందిరంలోకి పోయి విష్ణువును ధ్యానిస్తుంది.

స్వామీ అటు నా భర్తను కాదనలేను. ఇటు నీ వ్రతాన్ని భంగపడనివ్వలేను. నన్ను నీవే కాపాడాలంటూ వేడుకుంటుంది. దీంతో శ్రీమన్నారయణుడు దర్శనమిచ్చి అక్కడ గంగను ఉద్భవింపజేస్తాడు. ఆ గంగ మహా ఉదృతంగా రాజు వైపు ప్రయాణిస్తుంది. దీంతో రాజు భయపడి శ్రీ కూర్మం దగ్గరగా ఉన్న ఒక పర్వత పై భాగానికి చేరుకుంటాడు. అనంతరం తన తప్పును తెలుసుకుని అటుగా వచ్చిన నారదుడిని సహాయ అడుగుతాడు. నారదుడు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశిస్తాడు. దీంతో రాజు మంత్రాన్ని పట్టించి గంగను శాంతిపజేసి సముద్రంలో వంశధార పేరుతో కలిసి పోతుంది.

అలా కలిసే సాగర సంగమంలో రాజు స్నానం చేసి విష్ణువును ప్రార్థించగా స్వామి నాలుగు చేతులు, శంఖం, చక్రం, గద, పద్మములతో ప్రత్యక్షమవుతాడు. రాజు తన తప్పును మన్నించాల్సిందిగా కోరడమే కాకుండా.. ఇకపై ఇక్కడే కూర్మం రూపంలో ఉండిపోవాలని అభ్యర్థిస్తాడు. దీంతో విష్ణువు శ్రీ కూర్మ రూపంలో మహాలక్ష్మి సమేతుడై ఇక్కడ ఉన్న పుష్కరిణిలో ఉండిపోతాడు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఓ బోయ యువతి ఆమె భర్త బిల్లురాజు అటుగా వచ్చినప్పుడు పుష్కరిణిలో దివ్వమైన వెలుగు కనిపిస్తుంది.

అంతలోనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆ దంపతులకు దర్శనమిస్తాడు. అటుఅక్కడకు వచ్చిన శ్వేతరాజు జరిగిన విషయం బిల్లురాజుకు తెలియజేస్తాడు. దీంతో తమ జీవితం ధన్యమయినట్లు ఆ దంపతులు భావిస్తారు. అటు పై పుష్కరిణికి పశ్చిమదిక్కులో నివాసం ఏర్పరుచుకొని స్వామికి సేవలు చేయడం ప్రారంభిస్తాడు.అంతే కాకుండా తన నివసం పశ్చిమదిక్కుగాఉందికాబట్టిమీరుకూడాపశ్చిమాభిముఖంగానే ఉండాలని స్వామిని దంపతులు వేడుకుంటారు. అందువల్లే స్వామి పశ్చిమాభిముఖంగా ఉంటాడని పురాణ కథనం వివరిస్తుంది.

ఇక ఈ ఆలయ విశిష్టతలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఆలయంలోనూ గర్భగుడి మధ్యభాగంలో మూలవిరాట్ ఉంటాడు. అయితే ఈ ఆలయంలో మాత్రం గర్భగుడి ఎడమవైపు గోడకు ఒక మూలగా శ్రీ కూర్మనాథుని అవతారంలో శ్రీ మహావిష్ణువు భక్తులకు కనిపిస్తాడు. ఇటువంటి విధానమే మనం తిరుమల గర్భగుడిలో చూడవచ్చు. ఆలయంలో ఒక అడుగు ఎత్తు, ఐదు అడుగుల పొడవు, నాలుగుల వెడల్పు ఉన్న రాతిపీఠం పై కూర్మనాథస్వామి దర్శనమిస్తాడు. మొదట తల, మధ్యలో శరీరం చివరగా తోక మూడు భాగాలుగా మనం కూర్మనాథున్ని దర్శించుకోవచ్చు.

గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లడం వైష్ణవ సంప్రదాయానికి భిన్నమైనా ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోకి భక్తులను అనుమతించడం విశేషం. ఇటు వంటి సంప్రదాయం మరే ఇతర వైష్ణవాలయంలోనూ కనిపించదు. విగ్రహం పశ్చిమాభిముఖంగా ఉండటమే కాకుండా రెండు ధ్వజస్థంభాలు కలిగి ఉంటుంది. రోజు వారీ అభిషేకం నిర్వహించే అతి తక్కువ విష్ణు దేవాలయాల్లో శ్రీ కూర్మనాథస్వామి దేవాలయం కన‌క‌దుర్గామాత వైష్ణోదేవి రూపంలో ఉన్న ప్రపంచంలోని రెండవ దేవాలయం ఇదే. మరొకటి భారత దేశంలోని జమ్ము కాశ్మీర్ లో ఉంది. ఈ దేవాలయంలో ఉన్న 108 రాతి స్థంభాలు ఒక్కదానికొకటి పోలిక లేకుండా ఉంటాయి. ఏ రెండు రాతి స్థంభాల పై శిల్పాలు కూడా ఒకే విధంగా ఉండవు. శ్రీకూర్మనాథ స్వామి దేవాలయంలో ఒక స్వరంగ మార్గం ఉంది. దీని ద్వారా వారణాసి చేరుకోవచ్చునని చెబుతారు. అయితే దీనిని ప్రస్తుతం మూసి వేశారు. వారణాసి, పూరీల వలే మరణించిన వారి అంతిమ కర్మలను ఇక్కడ నిర్వహిస్తారు. దీని వల్ల వారికి మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

ప్రపంచంలో మరెక్కడా కూడా కూర్మావతారంలో మహావిష్ణువునకు దేవాలయం లేకపోవడానికి శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముని శాపమే కారణమి పురాణాలు చెబుతున్నాయి. అందులో ఉన్న వివరాలను అనుసరించి ద్వాపర యుగం చివరిలో బలరాముడు శ్రీకాకుళం దగ్గర్లో ఉమారుద్రకోటేశ్వర లింగం ప్రతిష్టింపచేస్తాడు. అటు పై తీర్థయాత్రల్లో భాగంగా శ్రీ కూర్మం వస్తాడు. అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు బలరాముడిని అడ్డగిస్తాడు. దాంతో ఆగ్రహం తెచ్చుకున్న బలరాముడు భైరవుడిని గిరగిర తిప్పి అవతలికి విసిరేస్తాడు. ఇది తెలిసిన కూర్మనాథ స్వామి స్వయంగా ప్రత్యక్షమయ్యి బలరాముడికి దర్శనభాగ్యం కలిగించాడు.

కోపం చల్లారని బలరాముడు ప్రపంచంలో ఇక్కడ మాత్రమే శ్రీ మహా విష్ణువుకు దేవాలయం ఉండాలని మరెక్కడా ఉండకూడదని శాపం పెట్టాడు. అందువల్ల ప్రపంచంలో ఇక్కడ మాత్రమే కూర్మావతర రూపంలో శ్రీ మహావిష్ణువు మనకు కనిపిస్తాడు. శ్రీ కూర్మంలోని పుష్కరిణిలో అడుగు భాగంలోని మట్టి తెల్లగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి జలక్రీడలు ఆడారని అందువల్ల ఆ మట్టి తెల్లగా మారిందని చెబుతారు. దీనినే గోపీ చందనం అని కూడా అంటారు. దీనిని నుదుట దరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని అందం పెరుగుతుందని స్థానికులు చెబుతారు.