చెక్ పవర్ ఎప్పుడొస్తుందో..?

11645చూసినవారు
చెక్ పవర్ ఎప్పుడొస్తుందో..?
సర్పంచ్ చెక్ పవర్ కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామంలో ఏ సమస్య నెలకొన్నా ప్రజలు వెంటనే సర్పంచ్ దృష్టికే తీసుకెళ్తున్నారు. చెక్ పవర్ లేకపోవడంతో ఏ పనులూ చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 980 పంచాయతీలకు గాను 958 పంచాయతీలకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు.

ఎన్నికల్లో గెలిచిన తరువాత బాధ్యతల స్వీకరణ కోసం నెలన్నర రోజులు ఎదురు చూశారు. ఎట్టకేలకు ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ లు, వార్డు మెంబర్లు అంతా ఈ నెల 8న ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ప్రభుత్వం ఇంత వరకూ సర్పంలకు చెక్ పవర్ ఇవ్వలేదు. దీంతో పంచాయతీల్లో నిధులున్నా పనులు చేయించి బిల్లులు చెల్లించే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. ప్రధానంగా వీధి దీపాలు, బోరుల మరమ్మతలు చేయాల్సి ఉంది. మరో వైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణ పనులు ముమ్మరంగా చేపట్టాల్సి ఉంది. ఈ పనులకు పంచాయతీల నిధుల నుంచే ఖర్చు చేయాల్సి ఉంది. అయితే నేటికీ చెక్ పవర్ ఇవ్వకపోవడంతో పనులు చేయించలేక, సతమతమ వుతున్నామని కొందరు సర్పంచ్లు చెబుతున్నారు. గతంలో కార్యదర్శులు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టే వారు. పాలక వర్గాలు రావడంతో ముందస్తు పెట్టుబడి పెట్టేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్థిక స్తోమత ఉన్న సర్పంచ్ సొంత నిధులు వెచ్చించి పనులు చేయిస్తున్నారు. లేనివారు ఇబ్బందిపడు తున్నారు. అటు ప్రజలకు సమాధానం చెప్పలేక, ఇటు పెట్టుబడి పెట్టి పనులు చేయించలేక సతమత మవుతున్నారు.

చెక్ పవర్ ఎప్పుడొస్తుందో తెలియక కొన్ని చోట్ల ఉప సర్పంచుగా ఉన్న సూపర్ సర్పండ్లు ముందస్తుగా సొమ్ము ఖర్చు చేసేందుకు వెనుకాడుతున్నారు. ఫలితంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. చెక పవర్ త్వరగా మంజూరు చేయాలని సర్పంచ్ లు కోరుతున్నారు. నీటి ఎద్దడి లేకుండా పంచాయతీల్లో బోర్లు మరమ్మతులు సొంత డబ్బులతో చేస్తున్నామని పలువురు సర్పంచులు పేర్కొన్నారు. దీంతో పాటు పారిశుధ్య పనుల నిర్వహణకు, ఎల్ ఈడీ దీపాల ఏర్పాటుకు సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. పంచాయతీల ఖాతాల్లో నిధులు ఉన్నా అప్పులు చేయాల్సి వస్తోంది.

పంచాయతీల్లో ఏ పని చేయాలన్నా, చేసిన పనులకు బిల్లు పొందాలన్నా అన్ని వివరాలు సీఎస్ఎంఎస్ లో నమోదు కావాల్సిందే. సర్పంచి పేరు, బడి, పాస్వర్డ్ ను పంచాయితీ కార్యదర్శులు తయారు చేస్తారు. వీటిని ట్రెజరీకి అనుసంధానం చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే సర్పంచ్ ప్రజల అవసరాల మేరకు నిధులు ఖర్చు చేసే అవకాశం వుంటుంది. ఇటీవల గ్రామాల్లో కరోనా నిరోధక టీకాలు వేశారు. సర్పంచ్ లే వైద్య, ఆరోగ్య సిబ్బందికి అవసరమైన టెంట్లు, తాగునీరు, బల్లలు ఇతర మౌలిక వసతులు కల్పించారు. కొన్ని పంచాయితీల్లో పారిశుధ్యం మెరుగుప రచటానికి చర్యలు తీసుకొన్నారు. ఈ విధంగా చేసిన పనులకు బిల్లులు డ్రా చేసుకోలేక సతమతమ వుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో తాత్కాలిక సిబ్బంది పని చేస్తున్నారు. వివిద రకాల తాత్కాలక ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి వేతనాలు అందటం లేదు. టెండర్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, పార్ట్ టైమ్ బిల్ కలెక్టర్లు, డీటీపీ ఆపరేటర్లు మూడు నెలల నుంచి వేతనాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలపై ప్రత్యేకాధికారులు తమకు సంబంధం లేదని చెపుతున్నారు. కొత్త సర్పంచ్ కు రికార్డులను అప్పగించాం. మీ వేతనాల సమస్యను పంచాయతీ కార్యదర్శితో మాట్లాడుకోండి అని సలహా ఇస్తున్నారు. తాత్కాలిక సిబ్బంది. జీతాలను పంచాయతీలో డ్రా చేసే అవకాశం లేక కార్యదర్శులు సతమతమవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి త్వరగా చెక్ పవర్ వచ్చేలా చర్యలు సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు.