సాహితీ వ్యాసంగంలోనూ కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరేశలింగం స్త్రీవిద్య కోసం ఉద్యమించి, ప్రచారం చేయడమే కాక, బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటరాని కులాలుగా భావించిన వారి పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవారు. ఉచితంగా చదువు చెప్పడంతో పాటు, పుస్తకాలు, పలకా బలపాలు అందిస్తూ వారిని చదువుల్లో ప్రోత్సహించేవారు.